తెలంగాణా. రాష్ట్రంలో ఏ పార్టీ బతకాలన్నా... ఈ అంశాన్ని మింగడమో, కక్కడమో చేయాలి. మధ్యే మార్గంగా ఉంటే ఫలితం శూన్యం. అయితే తెలంగాణా రాష్ట్రమే లక్ష్యమంటున్న టీఆర్ఎస్... నిర్ణయాత్మక తరుణంలో ఎందుకు మౌనం వహిస్తోంది. అసలు కాంగ్రెస్ ఇచ్చే తెలంగాణా వల్ల టీఆర్ఎస్కు ఉపయోగం ఉంటుందా? రాజకీయ అవసరాల దృష్ట్యా ఈ ఎన్నికలు ముగిస్తేనా మంచిదా? తెలంగాణా కోరుకునే రాజకీయేతర ఉద్యమకారుల మాటెలా ఉన్నా.. టీఆర్ఎస్ వ్యూహం, లక్ష్యం మరోలా ఉండే అవకాశం ఉందా?
2004 ఎన్నికల మేనిఫెస్టో నుంచి 2014 సీజన్ ముగింపువరకూ కాంగ్రెస్ తెలంగాణాను బంతాట ఆడింది. రేపుమాపు అని సాకులు చెబుతూ పదేళ్లు నెట్టుకొచ్చింది. ఇక తాజా ఎన్నికలకు ముందు ఏదో నిర్ణయం తీసుకోక తప్పనిస్థితిలో.... సీడబ్ల్యూసీ తీర్మానం చేసి రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసింది. ఇది మొదలు, సీమాంధ్ర గొడవలు... పార్టీల్లో చీలికలు, రోజుకో రభస, పూటకో మాట సర్వసాధారణమయ్యాయి. వీటిని చాలా దగ్గరగా పరిశీలిస్తున్న టీఆర్ఎస్ ఇప్పడు వ్యూహాత్మక మౌనం వహిస్తోంది. తెలంగాణా ప్రకటన వచ్చినా.. సంబరాలు ఇప్పుడు కాదు పార్లమెంటు ఓకే చేశాక మాత్రమే అంటూ బ్రేక్ వేసింది. ఆ తర్వాత వచ్చిన రాష్ట్రం వెనక్కిపోకుండా, సీమాంధ్రకు దీటుగా పల్లెల్లో బస్సు యాత్రకు సిద్ధమైంది. కానీ, తేదీ ప్రకటించినా కేసీఆర్ బస్సు యాత్ర మాత్రం ముందుకుసాగనేలేదు.
ఓవైపు అంటోనీ కమిటీ, కేంద్ర మంత్రుల కమిటి, టాస్క్ఫోర్స్ కమిటీ.. ఇలా ఆయా కమిటీలతో కేంద్రం పనిని వేగవంతం చేసినట్లు కనిపిస్తున్నా... టీఆర్ఎస్లో అదే మౌనం. అప్పుడప్పుడు షరతులు లేని తెలంగాణా కావాలన్న మాటలు తప్ప... తమ వంతుగా సరైన విధివిధాలను కేంద్రానికి సూచించిన దాఖలాలులేవు. జీఓఎంకు ఇచ్చిన నివేదిక కూడా కొత్త సీసాలో పాతసారానే అన్న చందంగా ఉంది.
వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు.. తెలంగాణానే లక్ష్యమైనా కాంగ్రెస్ చేతి నుంచి దాన్ని పొందడం వల్ల ఉపయోగాలు అంతంతమాత్రమే. కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదు, ఇవ్వలేదన్న ధైర్యంతో గతంలో విలీనం ప్రకటన చేసిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చాల్సిన పరిస్థితి. మొన్నమీద్య పార్టీ నేతలు ఈటెల రాజేందర్, హరీష్రావు, ఆ తర్వాత కేసీఆర్ మైకులు పెట్టి... రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అంటే విలీనం అన్నది కల్లే. మాటమారుస్తున్నారన్న విమర్శలు రావడంతో కేసీఆర్ మళ్లీ పాతపాట పాడారు. ముందు బిల్ పాస్ చేయండి, విలీనం గురించి తర్వాత ఆలోచిద్దామంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అనుకున్నట్లుగా రాష్ట్రం ఇచ్చేస్తే, టీఆర్ఎస్ను విలీనం చేయాలి. లేదంటే మాట తప్పారన్న మచ్చకు సిద్ధంగా ఉండాలి.
ఇక, కాంగ్రెస్.. తెలంగాణా ఇచ్చినా.. ఇచ్చింది మేమే అని చెప్పుకోకుండా ఉండదు. టీఆర్ఎస్ ఎంత సొంత ఘనతగా చాటుకున్నా... కాంగ్రెస్ కూడా ఇదే ఆయుధంతో ఎన్నికల్లోకి వెళ్లకపోదు. కాబట్టి ఉద్యమపార్టీకి క్రెడిట్లో కోత తప్పదు.
పైగా... రాష్ట్రం ఏర్పాటైతే పునర్నిర్మాణం అనే మాట తప్పితే, టీఆర్ఎస్కు పెద్దగా లక్ష్యాలేమీ లేవు. పైగా... కొత్తరాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి అన్న మాటను నిలుపుకోవాలంటే మాటవినే దళితుడు కేసీఆర్ చేతిలో ఉండాలి. కనుచూపుమేరలో అలాంటివారు ఇప్పుడెవరూ లేరు. ఎవరికిపడితే వారికి ముఖ్యమంత్రి పీటం కట్టబెట్టే సీన్ అస్సలేలేదు.
అదే కాంగ్రెస్ హయంలో తెలంగాణా రాకపోతే, 2014- టీఆర్ఎస్కు బాగా కలిసొస్తుంది. మిగతావన్నీ మర్చిపోయి సగటు పౌరుడి నోట్లో నానుతున్న తెలంగాణాను, కాంగ్రెస్ ఊరించి ఉసూరుమనిపిస్తే.. తెరాస ఎన్నికల్లో బాగా రాణిస్తుంది. ఇప్పుడున్న స్థితికంటే మెరుగుపడి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలచుకోవచ్చు.
ఇక ఇటు ఇప్పటికే దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తోంది. సర్వేలు కూడా సెంట్రల్లో తదుపరి అధికారం బీజేపీదే అని చాటుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వకపోయినా, అధికారంలోకి రాగానే బీజేపీ ప్రకటిస్తుందన్న నమ్మకం ఉంది కాబట్టి.. ఈ ఎన్నికల వేళ తెలంగాణా అందిపుచ్చుకోకపోవడమే TRS కు బెటర్ అన్న వాదం ఉంది. పైగా.. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం ప్రకటించే నాటికి టీఆర్ఎస్ చేతిలో ఎక్కువ ఎంపీ స్థానాలుంటాయి కాబట్టి కేంద్రంలో కీలకస్థానం పొందచ్చు. ఇక కమలనాథులతో విలీనం అన్న ఊసే లేదు కాబట్టి.. పార్టీ పార్టీగానే ఉంటుంది. నాయకులకూ జాతీయ స్థాయి హోదా దక్కుతుంది. 2019 వరకూ పార్టీకి గానీ, నాయకులకు గానీ ఎలాంటి డోకా ఉండదు. రాష్ట్రంలో అధికారం గురించి ఆలోచించాల్సిన అవసరమూ రాదు...
వెరసి... టీఆర్ఎస్కు తెలంగాణా ముఖ్యం. దానితోపాటే భవిష్యతు రాజకీయ అవసరాలు ముఖ్యం. అందుకేనేమో... బీజేపీ GOM నోట్కు ముందు సీమాంధ్ర మెలిక పెట్టినా.. ఒక్క మాట అన్న పాపన పోలేదు. ఈ రాజకీయ చదరంగంలో తెలంగాణా రాష్ట్రాన్ని కోరుకుంటున్న అసలు సిసలు తెలంగాణా వాదులు, అందునా యువకులు పావులుగా మారబోతున్నారనడంలో సందేహంలేదు.